ఏపీలో లాకప్ డెత్‌ల కలకలం.. గంగమ్మ కేసులో కీల‌క ప‌రిణామం

ఏపీలో లాకప్ డెత్‌ల కలకలం.. గంగమ్మ కేసులో కీల‌క ప‌రిణామం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఇటీవల వెలుగుచూస్తున్న వరుస పోలీసు(Police) కస్టోడియల్ మరణాల (Custodial Deaths) ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. విజయవాడలో గాదె సాయికృష్ణ(Gade Sai Krishna), దళిత యువకుడు క్రాంతి కుమార్ (Kranti Kumar) ఉదంతాల అనంతరం పోలీసుల విచారణ శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో.. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ‘గంగమ్మ కస్టోడియల్ డెత్’ (Gangamma Custodial Death)కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో కీలక సాక్షి, గంగమ్మ ప్రియుడు దర్గప్ప స్టేట్‌మెంట్‌ను అధికారికంగా రికార్డ్ చేశారు.

అసలు ఏం జరిగింది?
ఈ కేసు ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2024లో కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన గంగమ్మ కుమారుడు వీరేంద్ర (Veerendra) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. తన కొడుకు ఆచూకీ కనుగొనడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తల్లి గంగమ్మ స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(High Court) హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) దాఖలు చేసింది. హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో, డీజీపీ(DGP) ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన వీరేంద్ర మరెవరో కాదు.. స్వయంగా తల్లి గంగమ్మ, ఆమె ప్రియుడు బేగారి దర్గప్ప(Begari Dargappa) చేతిలోనే దారుణంగా హత్యకు గురైనట్లు తేలింది. వివాహేతర సంబంధాన్ని కొడుకు నిలదీశాడనే కోపంతోనే వీరేంద్రను హతమార్చి, శవాన్ని పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసు కస్టడీలో గంగ‌మ్మ మ‌ర‌ణం
పోలీసుల విచారణా కాలంలోనే గంగమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించడంతో ఇది కాస్తా ‘కస్టోడియల్ డెత్'(Custodial Death) (లాకప్ డెత్) వివాదంగా మారింది. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే గంగమ్మ చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. మరోవైపు గంగమ్మతో పాటు కస్టడీలో ఉన్న ఆమె ప్రియుడు దర్గప్ప కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పోలీసుల విచారణలో ఏం జరిగిందో, గంగమ్మ ఎలా మృతి చెందిందో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దర్గప్ప హైకోర్టును ఆశ్రయించాడు. మేజిస్ట్రేట్ ముందు సాక్షిగా దర్గప్ప (Dargappa) స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం కేసులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి
విజయవాడ కృష్ణలంక(Krishnalanka) సీఐ నాగరాజుపై(CI Nagaraju) గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాల‌తో ఇప్పటికే ఏపీ పోలీస్ శాఖ డిఫెన్స్‌లో పడింది. ఇప్పుడు కర్నూలు జిల్లా గంగమ్మ కేసు కూడా కోర్టు పరిధిలోకి వెళ్లడం, సాక్షి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడంతో ఈ కేసులో పోలీసుల పాత్ర ఏంటనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొందరు పోలీసు అధికారులపై చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment