చేప ప్రసాదానికి సర్వం సిద్ధం..

హైదరాబాద్ లో చేప ప్రసాదానికి సర్వం సిద్ధం..

హైదరాబాద్‌లో జరిగే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈసారి మృగశిర కార్తె జూన్ 8 రాత్రి ప్రవేశించనున్న నేపథ్యంలో అదే రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వసతి, ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఎండలు, ఉక్కపోతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, సీపీఆర్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.

మరోవైపు రద్దీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను రంగంలోకి దింపడంతో పాటు మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ ముగిసే వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment