ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నేతలపై అరెస్టుల పరంపర కొనసాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని (Pudi Srihari) పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ నెల 15న జరిగిన అరెస్ట్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, తాజా చర్యతో కూటమి ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు మరింత ముదిరాయి.
ఇవాళ బెంగళూరులో పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం పోలీసులు (Kuppam Police) ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా కేసు పేరుతో ఈ చర్య చేపట్టారని, అయితే ఈ కేసుపై ఈ రోజు హైకోర్టులో విచారణ ఉన్నప్పటీకీ ఏపీ పోలీసులు కోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆరోపించారు.
ఇదే విషయంపై పూడి శ్రీహరి సోదరుడు రాహుల్ (Rahul) మాట్లాడుతూ.. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పోలీసులు చట్టపరమైన విధానాలను పాటించారా లేదా అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.








