ఎన్నికల ప్రచారం సంపద సృష్టిస్తా.. ప్రజలకు పంచుతా అనే నినాదంతో అధికారంలో వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ (Alliance Government) అప్పుల్లో రికార్డ్ను (Debts Record) నెలకొల్పింది. తాజాగా మంగళవారం ఒక్కరోజే ప్రభుత్వం మరో రూ. 4,600 కోట్ల మేర భారీ అప్పు తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలలోనే (ఏప్రిల్) ప్రభుత్వం ఏకంగా రూ. 9,000 కోట్ల రుణాలను సేకరించడం గమనార్హం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Condition) తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం గడిచిన 23 నెలల కాలంలోనే గత ఐదేళ్ల నాటి రికార్డులను అధిగమించి అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం అప్పుల వేగం అనూహ్యంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం నేరుగా రూ. 1,98,564 కోట్ల మేర బడ్జెటరీ రుణాలు సేకరించింది. ప్రభుత్వ హామీతో వివిధ సంస్థల ద్వారా కార్పొరేషన్ల గ్యారెంటీ రూపంలో రూ. 1,10,704 కోట్ల అప్పులు చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట మరో రూ. 47,387 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకుంది. ఏప్రిల్ 7వ తేదీన రూ. 4,400 కోట్లు, తాజాగా నేడు రూ. 4,600 కోట్లు కలిపి కేవలం 20 రోజుల్లోనే రూ. 9,000 కోట్లు సేకరించింది.
చంద్రబాబు 23 నెలల రికార్డ్
గత వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత పాలనలో రుణాల సేకరణ వేగంగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాం ఐదేళ్ల కాలంలో (కరోనా రెండేళ్లు) సుమారు రూ. 3,32,000 కోట్ల మేర రుణాలు జరిగాయి. చంద్రబాబు హయాం కేవలం 23 నెలల్లోనే ఆ మొత్తాన్ని మించి రూ. 3,56,655 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకువచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలోనే టాప్.. ఆర్ధిక నిపుణుల ఆందోళన
దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పాలనా వైఫల్యం కారణంగానే ఆదాయ మార్గాలను పెంచుకోలేక, కేవలం అప్పుల మీదనే ప్రభుత్వం ఆధారపడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి కూటమి నేతలు గండికొడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఈ అప్పుల వల్ల రాష్ట్ర భవిష్యత్తు భారంగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.









