ప్రశాంతతకు మారుపేరు అయిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ హింస ప్రేరేపితమవుతోందా..? అనుభవం కలిగిన అధికార పార్టీ నాయకుల మాటలు ఇందుకు ఊతమిస్తున్నాయా..? అంటే అవునంటున్నాయి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే (Rajahmundry Rural MLA), టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chowdary) తాజా వ్యాఖ్యలు. వయసులో పెద్దవారైనప్పటికీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును (Ambati Rambabu) ఉద్దేశించి బుచ్చయ్య హెచ్చరికలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
‘గుమ్మటం పట్టిస్తాం.. నరికేయగలం’
వైసీపీ నేతలపై (YSRCP Leaders) విరుచుకుపడుతూ బుచ్చయ్య చౌదరి నోరు పారేసుకున్నారు. “అంబటైనా గిమ్మటైనా.. తలచుకుంటే గుమ్మటం పట్టిస్తాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, “మా కార్యకర్తలు తలుచుకుంటే ఎవరూ గుమ్మం దాటి బయటకు రాలేరు.. మాకు అధికారం ఉంది, తలుచుకుంటే నరికేయగలం” అంటూ హింసను ప్రేరేపించేలా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక సీనియర్ శాసనసభ్యుడి నోటి నుంచి ఇలాంటి దిగజారుడు మాటలు రావడంపై సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది.
రెడ్ బుక్ పాలనపై విమర్శలు
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో “రెడ్ బుక్ పాలన” (Red Book Rule) నడుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై వేధింపులు, దాడులు, చివరకు హత్యలకు (Murders) కూడా వెనుకాడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత బహిరంగంగా ‘నరికేస్తాం’ అని వ్యాఖ్యానించడం.. క్షేత్రస్థాయిలో హింసను మరింత ప్రోత్సహించడమేనని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి కానీ, ఇలాంటి బెదిరింపులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. “సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి మీరు నేర్పిస్తున్న సంస్కృతి ఇదేనా?” అని నిలదీస్తున్నారు. ఈ తరహా హింసాత్మక ప్రసంగాలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు (Law and Order) విఘాతం కలిగిస్తాయని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయంటున్నారు సొంత పార్టీలో శాంతిని కోరే నాయకులు.








