సీఎం రేవంత్రెడ్డిపై ఒక్క బీఆర్ఎస్ నుంచే కాకుండా అన్ని వర్గాల తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవల జర్నలిస్ట్ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసిన అంశంపై యూట్యూబర్లు, జర్నలిస్టులంతా సీఎంను తిట్టిపోశారు. తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాకుండా ఆంధ్రప్రదేశ్ నాయకుడు చంద్రబాబు నాయుడు పాలిస్తున్నారని విమర్శించారు.
హేట్ స్పీచ్ బిల్లుపై విమర్శలు
తెలంగాణ కోసం పోరాడి సాధించిన పాలన మళ్లీ పాత పాలకుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేవలం నామమాత్రపు ముఖ్యమంత్రిగా ఉన్నారని, పరిపాలనలో కీలక నిర్ణయాలు ఇతరుల చేతుల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా అణిచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే సోషల్ మీడియాపై కఠిన నియంత్రణలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా అభ్యంతరకరమైన పోస్ట్ చేస్తే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త చట్టం ప్రకారం గ్రూప్ అడ్మిన్తో పాటు సభ్యులపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.







