ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ, సోషల్ మీడియాలో ‘గోల్డ్ మ్యాన్’ (Gold Man)గా గుర్తింపు పొందిన పాతబస్తీ వాసి సూర్యాభాయ్ (Suryabhai) అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ (Pallapu Suresh Kumar) అసలు రంగు బయటపడింది. అతను ధరించేది అసలు బంగారం కాదని, కేవలం మెరుగు పెట్టిన ‘రోల్డ్ గోల్డ్’ అని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ (Income Tax Department) విచారణలో తేలింది.
విచారణలో తేలిన నగ్న సత్యాలు
కొండా విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఐటీ అధికారులు ఇతని ఆభరణాలను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో చేసి, పైన రోడియం పూత పూసినవని తేలింది. వీటి మొత్తం విలువ కేవలం రూ. 3 లక్షలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. అతను ధరించే అనేక ఆభరణాల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే వెండిపై బంగారు పూత పూయించినట్లు గుర్తించారు. ధనవంతుడిగా కనిపించేందుకు, పబ్లిసిటీ కోసం సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను (Fake Ornaments) వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
అద్దె ఇంట్లో నివాసం.. నామమాత్రపు ఆదాయం
బయటకి భారీ బంగారంతో ‘గోల్డ్ మ్యాన్’గా చలామణి అవుతున్న సురేశ్ కుమార్ వ్యక్తిగత జీవితం మరోలా ఉంది. అతనికి సొంత ఇల్లు కూడా లేదని, కేవలం రూ. 20 వేల అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని ఐటీ అధికారులు గుర్తించారు. గత ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని సురేశ్, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 4.9 లక్షల ఆదాయం మాత్రమే ఉన్నట్లు చూపించాడు.
ఎందుకీ వేషధారణ?
ఐటీ అధికారుల విచారణలో సురేశ్ కుమార్ తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందాలని, సినిమాల్లో అవకాశాలు వస్తాయనే ఆశతోనే ఇలా ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకున్నానని అతను అంగీకరించాడు. కేవలం ఫోజుల కోసమే ఈ తతంగమంతా నడిపించినట్లు స్పష్టమైంది.








