తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనుంది. టీటీడీ చైర్మన్, ఈవో ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోర్డ్ పలు కీలక నిర్ణయాలకు అంగీకారం తెలిపింది.
స్విమ్స్ హాస్పిటల్కు జాతీయ హోదా కల్పించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి, వారికి అవసరమైన సేవలు అందించే ఏర్పాట్లు త్వరలో చేయాలని పేర్కొన్నారు.
భక్తుల సమస్యలను సులభంగా తెలుసుకోవడానికి టీటీడీ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా, భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పిస్తారు, తద్వారా వారికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి లేదా కొత్త సౌకర్యాలు ఏవైనా అవసరం అవుతాయో అవగతం చేసుకోవచ్చు.
భక్తుల సంఖ్య పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే, తిరుమలలోని హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేయాలని కూడా వెల్లడించింది.
ఇతర కీలక నిర్ణయాలు
- కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించటం.
- క్యూ కాంప్లెక్స్ వద్ద 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టటం.
- ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు.
- శారదా పీఠానికి సంబంధించి మఠం లీజు రద్దు ప్రక్రియను ప్రారంభించడం.








