మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ అరెస్ట్‌ (Video)

మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ అరెస్ట్‌

హైద‌రాబాద్ శివారులో డ్ర‌గ్స్ పార్టీ క‌ల‌క‌లం సృష్టించింది. డ్ర‌గ్స్ పార్టీలో ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా ప‌ట్టుబ‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఇక్కడ భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ (SOT) పోలీసులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.

ఈ పార్టీలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్‌, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డితో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో, అక్కడ ఉన్నవారు గుర్తుతెలియని వ్యక్తులుగా భావించి గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డికి చెందిన తుపాకీతో ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం.

ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి సహా మరో ఐదుగురు కొకైన్ సేవించినట్లు నిర్ధారణకు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. మిగిలిన వారిని తదుపరి పరీక్షల నిమిత్తం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోపల సుమారు ఎనిమిది మంది వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీల్లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని, బుల్లెట్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

రాజస్థాన్ కనెక్షన్?
జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను ఏపీ ఎంపీ పుట్టా మహేష్ ఈ పార్టీకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నితీష్ శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో వార్తల్లో నిలిచిన రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment