ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా చేయడంతో పాటు సరుకు రవాణా వేగంగా జరిగేలా రింగు రోడ్లు ఉపయోగపడతాయని సీఎం తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆర్ అండ్ బీ శాఖపై జరిగిన సమీక్షలో ఇప్పటికే జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న రహదారులను అనుసంధానించి రింగ్ రోడ్లు అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మించాలని, జాతీయ రహదారులతో కలిపే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు.
అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై కూడా సీఎం కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వంలోని అన్ని శాఖలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని పేర్కొన్నారు. రవాణా శాఖలో మాన్యువల్ విధానాలకు ముగింపు పలికి అన్ని సేవలను ఆన్లైన్లో నిర్వహించాలని సూచించారు. అలాగే ఆర్టీవో కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ వద్ద ఆధునాతన బస్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







