ఇటీవల కాలంలో భర్తలపై దాడుల ఘటన రోజురోజుకూ పెరుగుతోంది. హనీమూన్ హత్య లాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు (Guntur) జిల్లాలోని మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ (TV Sound) తగ్గించమన్నందుకు భార్య (wife) భర్తను (Husband) కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ (Sheikh Ahmad) (26)కు ఏడాదిన్నర క్రితం క్రాంతి (Kranti) అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడి, తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. క్రాంతికి ఇప్పటికే ఒకసారి వివాహం కాగా, ఆమె మొదటి భర్త ఓ నేరం కేసులో జైలులో ఉన్నట్లు సమాచారం.
గురువారం రాత్రి ఇంట్లో టీవీ శబ్దం ఎక్కువగా ఉండటంతో అహ్మద్ సౌండ్ తగ్గించమని చెప్పాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన క్రాంతి వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని అహ్మద్ను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందకముందే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.







