డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే.. ఏపీ కూటమి ఎమ్మెల్యే కుమారుడు ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నానక్రామ్గూడ ప్రాంతంలో ఈగల్ టీమ్కు అందిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు సుధీర్ రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై స్పష్టమైన సమాచారం ఉండటంతోనే ఈగల్ టీమ్ ముందస్తుగా నిఘా పెట్టి దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి అనంతరం సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది సుధీర్ రెడ్డికి సంబంధించిన తొలి ఘటన కాదని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారన్న కోణంలో విచారణను ముమ్మరం చేశారు. డ్రగ్స్ నెట్వర్క్పై పూర్తి వివరాలు సేకరించేందుకు సుధీర్ రెడ్డితో పాటు అతడి స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరికి ఎంత ప్రమేయం ఉన్నా చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.







