గత ప్రభుత్వంలో వైఎస్సార్ వాహన మిత్ర పేరుతో ఆటోడ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన పథకం పేరు మార్చి ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి మాధవ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలు
సీఎం మాట్లాడుతూ “ఓజీ సినిమా చూసారు, దసరా పండుగ జరుపుకున్నారు, విజయవాడ ఉత్సవ్ బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగ రోజు” అని పేర్కొన్నారు. ఇకపై ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, అన్ని చెల్లింపులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఎదురైన కష్టాలను గుర్తుచేసిన సీఎం, గతంలో రోడ్ల పరిస్థితుల వల్ల వాహనాల మరమ్మతులకే ఆదాయం పోతుండేదని, ఇప్పుడు రోడ్లు మెరుగుపడ్డాయని అన్నారు. ఏడాదికి రూ.15,000 అందించడం ద్వారా డ్రైవర్లకు కొంత ఊరట కలుగుతుందని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాల ప్రస్తావన
“కూటమి ప్రభుత్వం (Coalition Government) మంచి చేసే ప్రభుత్వం. మా పాలనలో పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచాం. పింఛన్ల కోసం ఏకైకంగా రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాం. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పండుగలా పాలన
“ప్రజలకు పండుగలా పాలన అందించడమే మా లక్ష్యం. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు మేలు చేసిన ప్రభుత్వంపై పది మందికి చెప్పండి. భవిష్యత్తులో పండుగలే పండుగలు జరగేలా సుపరిపాలన అందిస్తాం. మన వాళ్ళు అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తారు. ఇంకోడు వస్తే ఇంకేదో ఇస్తాడని అనుకుంటారు కానీ, వచ్చి ఉన్నవి కూడా పీకేస్తాడు” అని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.








