ఏపీ ప్రభుత్వం (AP Government) అన్ని అనుమతులు సమీకరించి నిర్మించిన మెడికల్ కాలేజీ (Medical Colleges)లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) పీపీపీ (PPP) విధానంలోప్రైవేటీకరణ (Privatization) చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ పోరాటానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మచిలీపట్నం (Machilipatnam)లోనూ “చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులకు వైసీపీ శ్రేణులకు వాగ్వావాదం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నాయకులైన పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాష్ తో పాటు సుమారు 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అడ్డుపడటం, వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునేందుకు ప్రతిపక్షం పోరాటం చేస్తే ఏకంగా 400 మందిపై కేసులు పెట్టడం విడ్డూరమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.








