నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా గత రెండ్రోజుల క్రితం తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న నేపథ్యంలో జనసేన (Janasena) అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. పవన్ సినిమాను ఎలాగైనా హిట్ (Hit) చేయండి అంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (Janasena Party Central Office) నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ (Teleconference) ఆడియో లీక్ (Audio Leaked) అయ్యింది. మంత్రులు, పార్టీ అగ్ర నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఆడియోను కాన్ఫరెన్స్లో పాల్గొన్న జనసైనికులే బయటపెట్టి ఉంటారని భావిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ (Promotion) కోసం పవన్ ఆదేశాలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).. జనసైనికులకు భారీ టార్గెట్ ఇచ్చినట్లుగా ఆడియో ద్వారా అర్థం అవుతుంది. జనసేన పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ‘హరిహర వీరమల్లు’ సినిమాను హిట్ చేయాలని కోరారు. సినిమా విజయవంతం కావాలంటే ప్రతి జనసేన కార్యకర్త ఈ సినిమాను తప్పక చూడాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
డబ్బులు లేని వారికి టికెట్లు కొనిచ్చి చూపించాలని, ప్రతి థియేటర్లో కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాలని, సినిమాకు జనాన్ని తీసుకెళ్లే బాధ్యత పార్టీ నేతలదే అని స్పష్టం చేశారు. సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ను ఎదుర్కొనడం కోసం పవన్ స్వయంగా ప్రమోషన్లో పాల్గొనాల్సి వచ్చిందని టెలీకాన్ఫరెన్స్లో నాయకులు వెల్లడించారు.
జనసేన మంత్రులు కందుల దుర్గేష్ (Kandula Durgesh), హరిప్రసాద్లు (Hariprasad) కూడా ఈ టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. సినిమా ప్రమోషన్ కోసం తాను ప్రెస్మీట్లు పెట్టానని మంత్రి కందుల దుర్గేష్ జనసైనికులకు వివరించారు. పార్టీకి ఈ సమయంలో ఈ సినిమా ఎంత ముఖ్యమో చెప్పుకుంటూ, సోషల్ మీడియాలో మౌత్ పబ్లిసిటీ పెంచాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రమోషన్ చేయాలని సూచించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు రెండు సార్లు సినిమా చూస్తూ మద్దతు ఇస్తున్నారట.
పవన్ పొలిటికల్ ఈమేజ్కి ఇది కీలకం..
ఈ చిత్రం ద్వారా ప్రజల్లోకి చేరే అవకాశం ఉందని, పవన్ ఇమేజ్కి ఇది కీలకంగా మారనుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నేతలంతా మరో వారం పాటు ఈ సినిమాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి, పాజిటివ్ టాక్ను పెంచాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించబడినట్టు ఆ లీక్ ఆడియో ద్వారా తెలుస్తోంది. టెలికాన్ఫరెన్స్లో మంత్రులు, జనసేన పార్టీ అగ్రనాయకత్వం మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.








