కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం అవమానిస్తుందా? అధికారులను అందళమెక్కిస్తుందా? ఈ ప్రశ్నలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(RRR) తాజాగా చేసిన వ్యాఖ్యలు నిజమనిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన పిటిషన్ల కమిటీ సమావేశంలో ‘సుపరపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోవడంతో ఎమ్మెల్యేలు అవమానానికి గురయ్యారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. “కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉన్నతమైనది, కానీ కలెక్టర్, ఎస్పీ, ఎంపీలను ఒక టేబుల్ వద్ద కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలను కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి మరో టేబుల్ వద్ద కూర్చోబెట్టారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చాలా మంది ఎమ్మెల్యేలు తనతో ఫిర్యాదు చేశారని, అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తున్నానని ఆయన తెలిపారు.
రఘురామకృష్ణరాజు ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. “ఈ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఆహ్వానించాల్సి ఉంది, కానీ ఆ ఆహ్వానం లేకపోవడం లోపం. నేను ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే, సీటింగ్ విధానం చూసి బయటకు వచ్చేసేవాణ్ని,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘన ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా లేదా అనేది తనకు తెలియదని, కానీ ఇది ప్రభుత్వం చేసిన మొదటి తప్పుగా భావిస్తున్నానని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం స్పీకర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పిటిషన్ల కమిటీ సమావేశంలో, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు. “గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది” అని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని, ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.