ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. మర్వాడ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డెంగీ జ్వరంతో మృతిచెందిన శివశంకర్ అనే యువకుడి అంత్యక్రియలను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకోవడం గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. మార్వాడ గ్రామ నివాసి నాగరాజు కుమారుడైన శివశంకర్ గత కొంతకాలంగా డెంగీ జ్వరంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని బెంగళూరు ఆసుపత్రి నుంచి గ్రామానికి తీసుకొచ్చినప్పుడు, గ్రామ శ్మశానంలో ఖననం చేయకుండా స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని, శ్మశానంలో చేయకూడదని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారని, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి, రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.
శివశంకర్ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక కులం, రాజకీయ కోణాలు ఉన్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష వైసీపీ నాయకులు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఆటవిక చర్యలు జరగడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులైన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.