ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ 12తో ఏడాది పూర్తి చేసుకుంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పాలనను ప్రతి సమస్యకు కారణంగా చూపిస్తూ, ఏడాది గడిచినా నేటికీ “జగన్ కారణమే” అనే నినాదంతోనే ముందుకు సాగుతోంది. ఈ విధానం ఎలా ఉందంటే.. ఆఖరికి ఆకాశం నుంచి వర్షంతో పాటు వడగళ్లు పడినా దానికీ జగనే కారణమనే స్థాయికి చేరారని, ఈ వైఖరి పరిపాలనలో సానుకూల ఫలితాల కంటే ప్రజల్లో ప్రతికూల సందేశాన్ని మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
శాసనసభ సమావేశాల్లోనూ కూటమి నాయకులు ప్రతి సమస్యకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని “ఇది జగన్ చేసిన తప్పు వల్లే” అనే వాదనను వినిపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి, అప్పుల భారం, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, అమరావతి అభివృద్ధి వంటి అంశాలన్నింటిలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, ఏడాది పాలన తర్వాత కూడా స్వంత రిపోర్ట్ కార్డ్ను చూపించకుండా, గత ప్రభుత్వాన్ని నిందించడం కంటే, తమ పాలనలో సాధించిన విజయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. “ప్రతి సమస్యకు జగన్ను నిందించడం బలహీనతకు సంకేతం. ప్రజలు కూటమికి ఓటేసినప్పుడు అభివృద్ధి, సంక్షేమం కోరుకున్నారు, కేవలం నిందలు కాదు” అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రజల ఆశలు, అంచనాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైతే, రాష్ట్రంలో ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ 2019-2024 మధ్య అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన కూటమి, సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. “ఏడాది పాలనలో కూటమి ఏం సాధించిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కంటే, శాశ్వత పరిష్కారాలు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది” అని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రజలు కూటమి ప్రభుత్వం నుంచి అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాల అమలును ఆశిస్తున్న నేపథ్యంలో, నిరంతర నిందలు కాకుండా సానుకూల ఫలితాలపై దృష్టి సారించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకుంటే, రాజకీయంగా కూటమికి రానున్న రోజుల్లో సవాళ్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైరివర్గంపై కేసులు, అరెస్టులు, దాడులు ఒక రకంగా కూటమికి అపకీర్తి తెస్తే.. జరిగే ప్రతి విషయంలోనూ జగన్ను పేరు జపించడం ద్వారా పరిపాలనలో కూటమి బేలతనం ప్రస్పుటమవుతోందని, ఈ పద్ధతి మార్చుకోకపోతే పరియావసానం అనుభవించాల్సిందేనని సున్నితంగా సూచిస్తున్నారు.