ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను తెలిపేందుకు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు కొనసాగి, శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫామ్హౌస్లో జరిగిన ముగింపు సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదన్నారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నా మెడపై కత్తిపెట్టినా..
ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదని, అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారు కావాలని సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని, పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు మోడీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో లేకున్నా రైతుబంధు, కల్యాణలక్ష్మి
రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని, నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ ప్రజలను వంచిస్తోందన్నారు. ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చడం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని కేసీఆర్ గుర్తుచేశారు.