మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం అని, ఆ ప్రాంతంలో డ్రోన్ వినియోగం భద్రతా సమస్యలకు దారితీస్తుందని కోర్టులో వాదనలు వినిపించారు.
కేటీఆర్ తరఫు వాదనలు
కేటీఆర్ న్యాయవాది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజీని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించిందని, కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకపోవడంతో ఈ కేసులో పెద్దగా అభియోగం లేదని వాదించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం కేవలం జరిమానాతోనే పరిష్కరించవచ్చన్నారు. ఇక రాజకీయ కక్ష్యతోనే పోలీసులు సెక్షన్లను మార్చారని, మార్చిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ న్యాయవాది స్పష్టం చేశారు. సాక్షుల వాంగ్మూలాలన్నీ ఒకే విధంగా ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.