టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించే సేవా కార్యక్రమం అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఆంధ్రా హాస్పిటల్స్ లో ఇప్పటివరకు 4500కి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించి మహేశ్బాబు తన ఔదర్యాన్ని చాటుకోవడమే కాకుండా 4500 మంది చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
అంతేకాకుండా, మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ‘మదర్స్ మిల్క్ బ్యాంక్’ స్థాపించడంలో కీలక భూమిక పోషించడమే కాకుండా, బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలు అందించే కార్యక్రమాన్ని ఆంధ్రా హాస్పిటల్లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింతమంది చిన్నారులు వైద్య సహాయం పొందనున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ఇలాంటి మరిన్ని హెల్త్ ఇనిషియేటివ్లను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.