వెలిగొండకు YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి

వెలిగొండకు YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి

Summarize with AI

వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రెడిట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న వేళ.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కూడా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వెలిగొండపై చంద్రబాబు చెబుతున్నవన్నీ ‘కొండంత అబద్ధాలు’ అని మండిపడ్డారు.

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తవడం శుభసూచకమని షర్మిల అన్నారు. అయితే ఈ సందర్భంగా వెలిగొండ ప్రజాస్వప్నాన్ని సాకారం చేసే దిశగా వైఎస్సార్ చేసిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెలిగొండకు వెలుగు వైఎస్సార్‌ అని షర్మిల పేర్కొన్నారు. కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు ప్రాజెక్టులో సింహభాగం పనులు వైఎస్సార్ పాలనలోనే పూర్తయ్యాయని తెలిపారు.

సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే స్థాయికి వెలిగొండ ప్రాజెక్టు చేరిందంటే.. అది వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ఫలితమేనని షర్మిల అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘కట్టిన కష్టం వైఎస్సార్‌ది.. రాజకీయ ప్రచారం చంద్రబాబుది’’ అని విమర్శించారు. ప్రాజెక్టు తన విజన్‌తోనే వచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు.

1996 మార్చి 5న చంద్రబాబు శంకుస్థాపన పేరుతో కేవలం ఓ రాయి వేశారని షర్మిల ఆరోపించారు. అనుమతులు, నిధులు లేకుండా అడ్వైజరీ కమిటీలు, డీపీఆర్‌ల పేరుతో సంవత్సరాల తరబడి కాలయాపన చేశారని విమర్శించారు. శిలాఫలకం తప్ప ప్రాజెక్టు నిర్మాణంలో చెప్పుకోదగ్గ పని చేయలేదని అన్నారు. 2004లో వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని షర్మిల తెలిపారు. అప్పటివరకు చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి.. ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యామ్‌లతో సమగ్ర రూపం ఇచ్చారని పేర్కొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టులో 82 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని షర్మిల పేర్కొన్నారు. జలయజ్ఞం కింద సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులో సింహభాగం పనులు పూర్తి చేశారని తెలిపారు. సుమారు 22 కిలోమీటర్ల మేర సొరంగాల నిర్మాణం కూడా వైఎస్సార్ పాలనలోనే పూర్తయిందన్నారు. గొట్టిపాడు, సుంకేసుల డ్యామ్‌ల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి, పరిహారం అందించి, పనులను ముందుకు తీసుకెళ్లింది కూడా వైఎస్సార్ ప్రభుత్వమేనని షర్మిల తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుకు సూటిగా సవాల్ విసురుతున్నామని షర్మిల అన్నారు. తానే శంకుస్థాపన చేసి, తానే ప్రాజెక్టును పూర్తి చేశానని గొప్పలు చెప్పుకునే ముందు చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం కష్టం, చెమట వైఎస్సార్‌దైతే.. తక్కువ పనులు చేసి మొత్తం క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.

‘‘వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే.. చంద్రబాబు గారు చీకటి’’ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించాలంటే శంకుస్థాపన చేసిన సంకల్పం తనదైనా.. ప్రాజెక్టును సాకారం చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని గుర్తించాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment