మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఆకుమర్రులాకులో బాధిత రైతులతో మాట్లాడారు. తుఫాన్ వల్ల రైతులు అనేక కష్టాలు పడుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు తెలిపారు. మిగిలిన 4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
జగన్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రౌండ్లోకి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఎంత నిర్దయగా వ్యవహరిస్తోందో శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. 18 నెలల పాలనలోనే 16 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చాయి. అయినా ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? పంట ఇన్సూరెన్స్ సొమ్ము ఎవరికైనా అందిందా?” అని ప్రశ్నించారు. కూటమి పాలనలో రైతులు నిరాశలో మునిగిపోయారని, తమ కాలంలో రైతులకు భరోసా, భద్రత, నమ్మకం ఉన్నాయని అన్నారు.
జగన్ మాట్లాడుతూ, “గింజలు పాలు పోసుకునే సమయంలోనే మోంథా తుపాను రావడం రైతులకు భయంకర నష్టం తెచ్చింది. ప్రస్తుతం ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. మా పాలనలో ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ అధికారి ఉండేవారు. రైతుల పంటలకు నష్ట పరిహారం, బీమా భరోసా ఉండేది. రూ.7,800 కోట్లతో గిట్టుబాటు ధరను నిలబెట్టాం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు రైతులు ఎరువులు బ్లాక్లలో కొనాల్సిన పరిస్థితి వచ్చింది” అని విమర్శించారు.
టీడీపీ పాలనలో పంట నష్టం అంచనాల్లోనూ అవకతవకల పరంపర సాగుతోందని, పంట నష్టాలపై అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. “బాపట్ల జిల్లా పర్చూరులో 112%, జే.పంగలూరులో 114%, బల్లికరువులో 115%, వేటపాలెంలో 117%, చీరాలలో 120%, చిన్న గంజాంలో 128% పంట నష్టం చూపించారు. భూమి ఉన్నది 100 శాతం అయితే, పంట వేసిందని 120 శాతం చూపిస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతుల సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, రైతులతో కలిసి న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.








