దేశంలోని ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాలు ఎప్పుడూ వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పరిస్థితి మరింత ఎక్కువుగా ఉంటుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఎండలు కూడా తీవ్రంగా ఉండటంతో బయటకు రావడం ప్రజలకు కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో జరిగిన ఒక భారీ రాజకీయ ర్యాలీ నగర ట్రాఫిక్ను పూర్తిగా స్థంభింపజేసింది.
మంగళవారం ముంబైలోని వర్లీలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి గిరీష్ మహాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్పటికే రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అత్యవసర పనులతో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఒక మహిళ తీవ్ర అసహనంతో నేరుగా మంత్రి గిరీష్ మహాజన్ దగ్గరకు వెళ్లి.. ఏదైనా నిరసనలు ఉంటే మైదానాల్లోకి వెళ్లి చేసుకోవాలి గానీ.. ఇలా రోడ్లపై చేయడమేంటి? అని నిలదీసింది.
అక్కడ ఉన్న పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వాదనలు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ లాభం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలు అనవసరమని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.








