ఎన్డీయే (NDA) ప్రభుత్వం నేడు చారిత్రాత్మక వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టబోతోంది. బీజేపీ కూటమి ఇప్పటికే తన సంఖ్యా బలం, వ్యూహాలతో సిద్ధంగా ఉంది. అయితే, ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ (Congress) సహా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే చర్చ మొదలవుతుంది. రేపు రాజ్యసభ (Rajya Sabha) లో కూడా బిల్లు ప్రస్తావనకు రానుంది. ఇరు సభల్లోనూ 8 గంటల పాటు చర్చించనున్నారు.
పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ తరఫున సీనియర్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) చర్చను ప్రారంభించనున్నారు. మరోవైపు, ఇండీ కూటమి నేతలు బిల్లును ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ (BRS) బిల్లు పున:సమీక్షించాలని, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
అదేవిధంగా, ఎన్డీయే కూటమిలోని టీడీపీ(TDP), జేడీయూ (JDU), ఎల్జేపీ (LJP) తమ ఎంపీలకు విప్ (whip) జారీ చేయడం గమనార్హం. వక్ఫ్ బిల్లుపై సభల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.