వడోదర వేదిక (Vadodara Venue)గా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా (Team India) న్యూజిలాండ్ (New Zealand)పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ కీలక విజయానికి ప్రధాన కారణం స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇన్నింగ్స్ కావడం విశేషం.
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఒత్తిడిలోనూ తన అనుభవాన్ని, క్లాస్ను చాటుకున్న విరాట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇది అతని వన్డే కెరీర్లో 45వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కాగా, అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 71వ అవార్డు కావడం మరో విశేషం.
అవార్డుల వెనుక అమ్మకు ఉన్న స్థానం
మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలో హర్ష భోగ్లే విరాట్ను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఇన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అంటే వాటిని ఉంచుకోవడానికి ప్రత్యేక గది అవసరమయ్యే ఉంటుంది కదా? అని ప్రశ్నించగా, విరాట్ ఇచ్చిన సమాధానం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
తన అవార్డులన్నింటినీ (All His Awards) తాను అమ్మకు (Mother) పంపిస్తానని విరాట్ చెప్పాడు. గురుగ్రామ్లో ఉన్న ఆమె వాటిని ఎంతో ప్రేమతో దగ్గర పెట్టుకుంటారని, తన విజయాలు ఆమెకు గర్వంగా అనిపిస్తాయని చెప్పాడు. అందుకే అవార్డులన్నీ అమ్మకే ఇస్తానని చెప్పిన విరాట్ మాటలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.
రికార్డుల దిశగా విరాట్ ప్రయాణం
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 76 అవార్డులు సాధించగా, విరాట్ ఇప్పటివరకు 71 అవార్డులు అందుకున్నాడు. ఇద్దరి మధ్య కేవలం ఐదు అవార్డుల తేడా మాత్రమే ఉండటంతో, త్వరలోనే ఈ రికార్డును విరాట్ అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








