మైనర్ బాలిక రేప్ కేసులో బీజేపీ నేతకు బెయిల్

మైనర్ బాలిక రేప్ కేసులో బీజేపీ నేతకు బెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉన్నావ్ మైనర్ బాలిక (Minor Girl) అత్యాచార (Rape) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బీజేపీ(BJP) మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్‌ (Kuldeep Singh Sengar)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో కుల్దీప్ సింగ్ సింగార్‌పై కేసు నమోదైంది. ఈ కేసు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపగా, బాధితురాలి కుటుంబంపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. బాధితురాలి తండ్రి కస్టడీలో అనుమానాస్పదంగా మరణించడం ఈ కేసులో మరింత కలకలం రేపిన అంశం. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించారనే ఆరోపణలతో కూడా కుల్దీప్ సింగ్ సింగార్‌పై కేసులు నమోదు అయ్యాయి.

ఈ ఘటనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు గతంలో సింగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే తాజాగా ఆరోగ్య పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, అత్యాచార కేసులో విధించిన యావజ్జీవ శిక్షను తాత్కాలికంగా రద్దు చేస్తూ, కఠిన షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేశారు. బాధితురాలి భద్రత దృష్ట్యా ఆమెకు సీఆర్పీఎఫ్ రక్షణ (CRPF Security) కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

ఈ నిర్ణయంపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “నా తండ్రిని హత్య చేశారు, నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారు? ఇదెక్కడి న్యాయం?” అంటూ బాధితురాలు వాపోయింది. కోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆమె పేర్కొంది. ఈ కేసులో బెయిల్ మంజూరుపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment