రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ధనబలం, అంగబలం ఉన్న నేతలను సామాన్యులు ఓడించిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి అసాధారణ విజయమే ఒకటి నమోదైంది. ఒక సామాన్య ట్యూషన్ టీచర్, ఏకంగా కేంద్రమంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
భారీ మెజారిటీ
తమిళనాడులోని అవినాషి (SC) నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక్కడి నుంచి టీవీకే (TVK) పార్టీ తరపున పోటీ చేసిన 28 ఏళ్ల ఎస్. కమలి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రి ఎల్. మురుగన్పై ఘనవిజయం సాధించారు. దాదాపు 15,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఉచిత ట్యూషన్ల నుంచి అసెంబ్లీ వరకు..
కమలి నేపథ్యం చాలా సామాన్యమైనది. ఆమె తన ప్రాంతంలోని పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ ‘ట్యూషన్ టీచర్’గా అందరికీ సుపరిచితురాలు. ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన ప్రజల్లో ఆమెపై మంచి అంచనాలు ఉన్నాయి. టీవీకే పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరిన కమలికి, పార్టీ అధినేత ఆమె చొరవను చూసి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.
చంకలో పాప.. గుండె నిండా ఆశయం
ఎన్నికల ప్రచారంలో కమలి అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం నాలుగు నెలల వయసున్న తన పసిపాపను చంకన వేసుకుని ఆమె నియోజకవర్గంలోని ప్రతి గల్లీని చుట్టేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా, ఒక తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే, ప్రజా ప్రతినిధిగా సేవ చేసేందుకు ఆమె పడిన తపన ఓటర్ల మనసు గెలుచుకుంది. “సామాన్య మహిళా శక్తి ముందు పదవులు, హోదాలు సరిపోవని కమలి విజయం నిరూపించింది.”
అసాధారణ విజయం – ఆదర్శప్రాయం
పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు, కేంద్ర స్థాయిలో చక్రం తిప్పే నాయకుడిని ఒక సామాన్య మహిళా అభ్యర్థి ఓడించడం సామాన్యమైన విషయం కాదు. కమలి విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే సామాన్యులు కూడా చట్టసభలకు వెళ్లొచ్చనే నమ్మకాన్ని యువతలో నింపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కమలికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. “రియల్ హీరో” అంటూ నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు.








