పోలవరం దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేవీపట్నం మండలంలోని గంగపాలెం గ్రామంలో రాత్రి సమయంలో పెద్దపులి పశువులపై దాడి చేసి 14 దూడలు, ఒక గేదెను చంపేసిన ఘటన కలకలం రేపింది. ఉదయం రైతులు పశువుల మృతదేహాలను గుర్తించడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అడవి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది, పెద్దపులి కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయంతో ఇళ్లకే పరిమితమవుతుండగా, పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.








