అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై..

Summarize with AI

టీమిండియా సీనియర్ క్రికెటర్, 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించిన రహానే, ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కూడా ఆడబోనని వెల్లడించాడు. దీంతో భారత క్రికెట్‌లో ఓ కీలక అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది. 2020-21లో అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లగా, జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన ఆయన, అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిపించి భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

అజింక్య రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మూడు ఫార్మాట్లలో కలిపి 8 వేలకుపైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లో 5,077 పరుగులు, 12 సెంచరీలు నమోదు చేసిన రహానే విదేశీ గడ్డపై అత్యంత నమ్మకమైన భారత బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్న ఆయన, 2023 జూలైలో వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టులో చివరిసారిగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రశాంత స్వభావం, ఒత్తిడి సమయంలో బాధ్యతాయుతమైన బ్యాటింగ్, జట్టుకు అంకితభావంతో అభిమానుల మనసులు గెలుచుకున్న రహానేకు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన భారత క్రికెట్‌కు అందించిన సేవలను కొనియాడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment