ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ (Tummidihatti Barrage) నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ముంపు ప్రభావం తక్కువగా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై(Pranahita-Chevella Project) ఇప్పటికే 11 వేల కోట్లు ఖర్చు చేశామని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల పనులు పూర్తయ్యాయని సమీక్షలో చర్చించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు(Sripada Yellampalli Reservoir) నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యక్షంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు (Uttam Kumar Reddy) సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జియో టెస్టింగ్ పనులను వర్షాల కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజ్ పూర్తయితే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు.







