ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Summarize with AI

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై భయానక పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్తున్న అభి ట్రావెల్స్‌కు చెందిన ఫ్రెష్‌ బస్సు ద్వారకుంట సమీపంలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఐరన్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆగి ఉన్న మ‌రో లారీని ఢీకొట్టింది. లారీలో ఉన్న భారీ ఇనుప రాడ్లు ప్రమాదం ధాటికి వెనుక నుంచి వస్తున్న బస్సులోకి దూసుకెళ్లాయి.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఐరన్ రాడ్లు బస్సులోకి చొచ్చుకుపోవడంతో పలువురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కొందరి ముఖాలు సైతం గుర్తుపట్టలేని విధంగా పరిస్థితి విషమంగా మారింది. ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఆ తర్వాత ఇనుప రాడ్లు వెనుక వస్తున్న బస్సులోకి దూసుకెళ్లడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల పూర్తి కారణాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియతో పాటు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైవే-65పై చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment