టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆందోళన నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్కప్ వరకు రోహిత్ ఫిట్గా కొనసాగగలడా? అనే అంశంపై బీసీసీఐ పూర్తిగా నమ్మకంగా లేదని సమాచారం. ఇటీవల ఐపీఎల్లో హ్యామ్స్ట్రింగ్ గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైన హిట్మ్యాన్ ఫిట్నెస్ను బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న వన్డే సిరీస్కు రోహిత్ ఎంపికైనా, ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వన్డేల్లో పూర్తి 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సి ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ రికవరీకి ఎక్కువ సమయం పడటం వంటి అంశాలు సెలెక్టర్లను ఆలోచనలో పడేశాయట.
ఇక రోహిత్కు బ్యాకప్గా కొత్త ఓపెనర్లను సిద్ధం చేసే పనిలో కూడా బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ ను ఓపెనర్గా పరిశీలిస్తుండగా, జైస్వాల్ కు ఇంకా వన్డేల్లో తగిన అనుభవం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోహ్లీ ఫిట్నెస్, ఫామ్ ప్రస్తుతం అద్భుతంగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై కోహ్లీ, రోహిత్ ఎంపికలను ఒకే కోణంలో చూడకూడదనే అభిప్రాయం టీమ్ మేనేజ్మెంట్లో పెరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.








