భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ట్రైలర్ను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా చేరిందని, దీంతో భారతీయ పురాణ గాథను అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారు. ట్రైలర్ విడుదల వాయిదా పడినా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లాంచ్కు సన్నాహాలు జరుగుతుండటంతో ‘రామాయణ’పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.








