జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో (Japan Open Badminton Tournament) టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ఇప్పుడు తన ఆటతోనే కాదు, ఓ సరదా ట్వీట్తోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధును అభినందిస్తూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) చేసిన ట్వీట్కు ఆమె ఆసక్తికరంగా స్పందించింది. “థ్యాంక్యూ సో మచ్ రాజమౌళి సార్… మీ ‘వారణాసి’ (Varanasi) సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ (Badminton Player) పాత్ర ఉంటే… కొత్త హీరోయిన్గా (Heroine) నటించడానికి కూడా నేను సిద్ధమే” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేసింది. సింధు చేసిన ఈ చమత్కార వ్యాఖ్య నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్గా మారింది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’(Varanasi) దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో రూపొందుతోంది. రాజమౌళి ప్రతి పాత్రను ప్రత్యేకంగా మలుస్తారనే పేరుండటంతో, పీవీ సింధు చేసిన సరదా ఆఫర్ నిజంగానే తెరపైకి వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కూడా రాజమౌళి సినిమాలో నటించాలని ఆసక్తి వ్యక్తం చేసిన విషయం గుర్తు చేస్తూ, ఇప్పుడు పీవీ సింధు కూడా అదే జాబితాలో చేరిందంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.








