ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయంలో అధికార పక్షంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మంత్రివర్గ సమావేశానికి (Cabinet Meeting) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గైర్హాజరు కావడం, అదే సమయంలో మంగళగిరిలోని (Mangalagiri) తన క్యాంపు కార్యాలయంలో తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించడం రాజకీయ వర్గాన్ని, అధికార యంత్రాంగంలోనూ రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది.
ఇటీవలే ముంబైలో (Mumbai) కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లో (Hyderabad) విశ్రాంతి అనంతరం మంగళగిరికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాడేపల్లిలోని (Tadepalli) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ సినీ సన్నిహితుడి కుటుంబాన్ని పరామర్శించడం, ఆ రెండో రోజు జనసేన క్యాంప్ ఆఫీస్ వద్ద కుంకీ ఏనుగులను (Kumki Elephants) స్వాగతించి.. ఆహారం అందించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మధ్యలోని 23వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశానికి మాత్రం హాజరుకాలేదు.
ఆరోగ్య సమస్యల (Health Issues) కారణంగానే కేబినెట్కు హాజరు కాలేదని భావించాలంటే.. అదే రోజు అధికారులతో సమావేశం ఎలా నిర్వహించారనే అంశాన్ని రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. పర్యటనలు చేయగలుగుతున్నారు.. నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, అధికారులకు దిశానిర్దేశం చేయగలుగుతున్నారు… కానీ, ప్రభుత్వంలో కీలకమైన హోదాలో ఉన్న పవన్.. కేబినెట్ సమావేశానికి (Cabinet Meeting) మాత్రం దూరంగా ఉండటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు కేబినెట్ మీటింగ్లకు హాజరుకాకపోవడం, హాజరై మధ్యలోనే ఆరోగ్య కారణాలతో వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
‘రాంగ్ సిగ్నల్’ వెళ్తోందా?
సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు కేబినెట్ సమావేశానికి (Cabinet Meeting) హాజరు కాలేని పరిస్థితి ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవడం పరిపాటి. అనారోగ్య కారణాలు లేదా విదేశీ పర్యటనలు ఉంటే తప్ప, మంత్రులు కేబినెట్, ఇతర ప్రభుత్వ సమీక్షలకు దూరంగా ఉంటారు. అయితే, ఓవైపు కేబినెట్ భేటీ జరుగుతుండగానే, మరోవైపు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎర్రచందనంపై సమీక్ష నిర్వహించడం, దాన్ని పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం పాలనా వ్యవస్థలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న.

రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలపై మంత్రులందరూ చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకునే వేదిక కేబినెట్. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాంటి సమావేశాలకు పదేపదే గైర్హాజరు కావడం మంచి పరిపాలనా (Administrative) సంప్రదాయం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ వేదికకు రాకుండా, అదే సమయంలో వేరే సమీక్షలు నిర్వహించడం అనేది పాలనలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బలహీనతను బయటపెట్టడమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
95 ముఖ్యమంత్రిని, అడ్మినిస్ట్రేషన్కు (Administrative) మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడి సమక్షంలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఉప ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక అధికారాల వైఖరా? లేక పాలనా పరంగా చంద్రబాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చూపుతున్న నిశ్శబ్ద నిరసనా? అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయి.
ఈ పరిణామాన్ని మరో కోణంలోనూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు-పవన్(Chandrababu Naidu-Pawan Kalyan) మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక తార్కాణం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు వాటిపై రాజకీయ చర్చ జరగడం సహజమే. కానీ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి పదేపదే కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం మాత్రం రాజకీయంగా తేలికగా తీసుకునే అంశం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శాఖల నిర్వహణ, సమీక్షలు ముఖ్యమే అయినప్పటికీ… రాష్ట్ర స్థాయి విధాన నిర్ణయాలు తీసుకునే ‘కేబినెట్ సమష్టి బాధ్యత’ను (Cabinet Collective Responsibility) విస్మరించడం శుభపరిణామం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఇటువంటి సంఘటనలు ఏపీ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరి ఈ విమర్శలు, రాజకీయ విశ్లేషణలపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.








