తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao)ల మధ్య వైరం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. రూ. 5 కోట్లకు ఎమ్మెల్యే టికెట్ అమ్మకం నుంచి, పేకాట, గంజాయి, కన్సల్టెన్సీ మోసాలు అంటూ ఎంపీ కేశినేని చిన్నీ అవినీతి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ కొలికపూడి సంచలనంగా మారారు. ఈ వివాదం అధికార టీడీపీ(TDP)కి తలనొప్పిగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న ఈ ఘర్షణ పార్టీ ప్రతిష్టకు తీవ్ర దెబ్బతీస్తోంది.
ఇప్పటికే చిన్ని అవినీతి, గంజాయి, ఇసుక, పేకాట దందాల గురించి బహిరంగంగా ఆరోపించిన కొలికపూడి, ఇప్పుడు బాధితులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్ (Hyderabad)లో కేశినేని చిన్ని బాధితుల సమావేశం నిర్వహించేందుకు కొలికపూడి శ్రీనివాసరావు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సమావేశానికి ఆయన స్వయంగా హాజరవ్వనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణల ప్రకారం.. కేశినేని చిన్ని సుమారు రూ.150 కోట్లు ప్రజల డబ్బు ఎగనామం పెట్టాడని, కోట్ల రూపాయలు వసూలు చేసి బాధితులకు ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ ఎంపీ చిన్ని మోసపూరిత కార్యకలాపాలపై బాధితులను సమీకరించి న్యాయం కోసం ముందుకు వెళ్తామని ఆయన ప్రకటించారు.
ఇక నవంబర్ 2న జరగబోయే ఈ సమావేశం టీడీపీకి మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, నేతలు మౌనం వహించడం గమనార్హం. కేశినేని చిన్ని వివాదం టీడీపీకి రాజకీయంగా కొత్త తలనొప్పిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








