టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ‘ఊరు–వాడ’ కార్యక్రమానికి బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థపై జూ.ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. RAW NTR సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని తారక్ కార్యాలయం పేర్కొంది. జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం ప్రకటించడంపై అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం ఉన్న సంస్థగా ప్రజల్లో భావన కలిగించేలా RAW NTR వ్యవహరిస్తోందని కార్యాలయం పేర్కొంది. అయితే ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని స్పష్టంగా వెల్లడించింది.
ఎన్టీఆర్కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అధికారిక సమాచారం కేవలం ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడించబడుతుందని కార్యాలయం తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా వచ్చే ప్రచారాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఈ ప్రకటనతో ఎన్టీఆర్ పేరు చుట్టూ జరుగుతున్న అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది.
జూ.ఎన్టీఆర్ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం వెనుక తెర వెనుక ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయా అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటన విడుదల కావడం ఫ్యాన్స్తో సహా ఆయన రాకను స్వాగతించే పొలిటికల్ లీడర్స్కూ మింగుడు పడడం లేదు.








