తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా, నేడు హైకోర్టు జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. జనసేన తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టులోనూ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పోలీసుల నిర్ణయంతో కోర్టుకు..
ప్రొఫెసర్ నాగేశ్వర్రావు విశ్లేషణ విషయం నానా యాగీ చేసి, తెలంగాణ జర్నలిస్టులను, ఉద్యమకారుల పట్ల పరుషపదజాలంతో మాట్లాడిన జనసేన పార్టీ నేతలు.. ఆ వెంటనే తెలంగాణలో ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ను ప్లాన్ చేశారు. జనసేన నేతల తీరు పట్ల తెలంగాణ సెంటిమెంట్ రగిలింది. పవన్ పార్టీ వ్యతిరేకంగా తెలంగాణ వాదులంతా ఒక్కటయ్యారు. ప్రొఫెసర్ విషయంలో జనసేన వ్యవహరించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్వేగాలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో జనసేన సభకు భద్రతా కారణాలు, పార్కింగ్ అంశాలను చూపిస్తూ తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన శ్రేణులు, ఈరోజు అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ, కోర్టు కూడా పోలీసుల నిర్ణయంతో ఏకీభవిస్తూ పిటిషన్ను రిజెక్ట్ చేయడంతో సభ నిర్వహణ ప్రస్తుతానికి నిలిచిపోయింది.
పవన్ కళ్యాణ్ ట్వీట్!
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “తెలంగాణలో ‘నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించారు. సరే, ఈరోజు సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నా నివాసంలోనే ప్రెస్మీట్ పెడుతున్నా. కనీసం నా సొంత ఇంట్లో ప్రెస్మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇస్తారో లేదో చూద్దాం” అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం సభకు పర్మిషన్ దక్కకపోవడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్తో ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సాయంత్రం జరగబోయే ప్రెస్మీట్లో పవన్ తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.








