ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మరో డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని మాధురి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
మాధురి రాథోడ్ ఫిర్యాదు ప్రకారం.. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపించింది. అయితే ఆ తర్వాత తనను మోసం చేశాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఈశ్వర్ సాయిపై BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా ఈశ్వర్ సాయి వ్యవహరించాడని కూడా మాధురి ఆరోపించారు. తన ఫోన్లో ఉన్న వీడియోలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అక్రమ సంబంధాలు ఉన్నట్లు చూపించేలా ఏఐ వీడియోలు సృష్టించారని ఆమె వాపోయారు.
ఇక ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఓ హోటల్ రూమ్లో ఉన్న సమయంలో ఆయన భార్యకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్గా మారాయి. అయితే ఆ సమయంలో తన తప్పేమీ లేదంటూ ఈశ్వర్ సాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా మాధూరి రాథోడ్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మాధురి రాథోడ్ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోన్ డేటా, వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది.








