ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలాన్ని భారత్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. సెప్టెంబర్ 15న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2023లో కొచ్చిలో వేలం జరిగిన తర్వాత దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి విదేశీ వేదికల్లో వేలాలు నిర్వహించారు. అయితే మినీ వేలం కోసం ఫ్రాంచైజీల ప్రతినిధులు విదేశాలకు వెళ్లాల్సి రావడంతో ఏర్పడే లాజిస్టికల్ సమస్యలు, గతంలో ఫ్రాంచైజీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి వేలాన్ని భారత్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే వేలం నిర్వహించే నగరాన్ని బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. ఫ్రాంచైజీల ప్రతినిధులకు తగిన వసతి సౌకర్యాలు, ముఖ్యంగా ఫైవ్స్టార్ హోటళ్లలో అవసరమైన గదుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని వేదికను ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. నెల రోజుల్లో జరగనున్న తదుపరి సమావేశంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగింపు లేదా తొలగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నిబంధనపై ఫ్రాంచైజీల నుంచి ఇప్పటికే బీసీసీఐ అభిప్రాయాలు కోరగా, కొన్ని జట్లు కొనసాగించాలని కోరుతున్నట్లు సమాచారం.








