దేశవ్యాప్తంగా విపరీతంగా పెల్లుబికిన విద్యార్థుల ఆందోళనలు, యువత నిరసనల ఉప్పెనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. వివాదాస్పద ‘నీట్ (NEET-UG) పేపర్ లీక్’ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యాశాఖ మంత్రి రాజీనామాను ప్రధాన డిమాండ్లుగా చేసుకుని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున పోరాటం ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలపై పోలీసులు చేసిన లాఠీచార్జ్, పంపిన టియర్ గ్యాస్ దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యువత భగ్గుమంది. కేవలం విద్యార్థులే కాకుండా, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
ప్రభుత్వం తొలుత విద్యాశాఖ మంత్రి రాజీనామా ప్రతిపాదనను తోసిపుచ్చినప్పటికీ, కేంద్రంపై ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తింది. చర్చలతో పోరాటాన్ని ఓ కొలిక్కి తీసుకువద్దామని భావించినప్పటికీ యువత వెనక్కి తగ్గలేదు.. దీంతో విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయకతప్పలేదు.
జంతర్ మంతర్ వద్ద రోజురోజుకూ ఉధృతమవుతున్న నిరసనలు, పార్లమెంట్ స్థంభన, దేశవ్యాప్తంగా విద్యార్థులు చూపుతున్న పట్టుదల వల్ల కేంద్ర ప్రభుత్వంపై అపూర్వమైన రాజకీయ ఒత్తిడి పెరిగింది. తీవ్రమవుతున్న ఆందోళనల నడుమ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.ఈ పరిణామం దేశంలో విద్యార్థి లోకానికి, యువత ఐక్యతకు దక్కిన విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.








