ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (Online Betting App) కేసులో సీఐడీ (CID) దర్యాప్తు వేగం పెంచింది. సోషల్ మీడియాలో వివిధ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి పేర్లు బయటకు రావడంతో సంచలనంగా మారింది. వారిలో విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా ఇప్పటికే సీఐడీ విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో విచారణ కొత్త దశలోకి ప్రవేశించింది. నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sreemukhi), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి (Amrutha Choudhary) పేర్లు తాజాగా సీఐడీ లిస్టులో చేరాయి. సీఐడీ నోటీసుల ప్రకారం ఈ రోజు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ సమయంలో వారు పొందిన సమాచారం ఏమిటి? ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? వంటి కీలక అంశాలపై సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.
ఈ కేసులో సినీ సెలబ్రిటీలు వరుసగా విచారణకు హాజరవుతుండటంతో పరిశ్రమలో ఆందోళన పెరుగుతోంది. ఇంకా ఎవరికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందో, దర్యాప్తు దిశ ఏవైపు సాగుతుందో అన్నది సినీ వర్గాలు మరియు సోషల్ మీడియా వర్గాల్లో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. విచారణ క్రమం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








