ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, తాడేపల్లి (Tadepalli) మండలంలో కృష్ణానదిని (Krishna River) ఆనుకుని ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కరకట్ట నివాసం (Karakatta Residence) పరిసరాలకు భారీగా హంగులు చేకూర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం నివాసానికి వెళ్లే రోడ్డును(Road) అందంగా అలంకరించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.5.32 కోట్లను కేటాయించడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కొందవీటి వాగు (Kondaveeti Vagu Stream) నుంచి సీఎం కరకట్ట నివాసం (CM Karakatta Residence) వరకు రోడ్డుపై డెకరేటివ్ వీధి లైట్ల ఏర్పాటు కోసం సీఆర్డీఏ టెండర్లు (CRDA Tenders) పిలిచింది. ఇప్పటికే ఉన్న సాధారణ వీధి దీపాలను తొలగించి, అలంకార దీప స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.5.32 కోట్లుగా నిర్ణయించబడింది.
ఇదే కరకట్ట నివాసానికి సంబంధించి అక్టోబర్ 10వ తేదీన రూ.4.40 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న 4.40 కోట్లతో కరకట్ట లైటింగ్ కి టెండర్లు పిలిచింది. తాజాగా అదే పనిని రూ.5.32 కోట్లకు పెంచుతూ మళ్ళీ టెండర్ పిలిచింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సీఎం నివాస హంగుల కోసం మళ్లీ నిధులు పెంచడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, నిన్ననే సీఎం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి మరో రూ.10.92 కోట్లు విడుదల కావడం మరింత వివాదానికి దారితీసింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతున్న వేళ, సీఎం నివాసం కోసం హంగులు, ఆర్భాటాలు అవసరమా? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా అది ప్రభుత్వ అధికారిక నివాసమా, లేక వ్యక్తిగత నివాసమా అన్న అంశంపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎలాగూ అమరావతిలో ఐదెకరాల్లో సీఎం చంద్రబాబు సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని, అది పూర్తయ్యాక దాని హంగులకు కూడా మళ్లీ కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.








