సోషల్ మీడియా వేదికగా నిర్మాత బండ్ల గణేష్ వర్సెస్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎవరినీ ఉద్దేశించకుండా ప్రకాష్ రాజ్ పెట్టిన ఒక సాధారణ ట్వీట్ను.. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆపాదించేలా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో బండ్ల గణేష్ వైఖరిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అసలేం జరిగింది?
ఇవాళ ఉదయం నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర! కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్ గా వస్తున్నారా? దీంట్లో ఏదో ఒకటి చెప్పి రండి” అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆయన ఏ రాజకీయ నాయకుడి పేరు కానీ, ఏ పార్టీ పేరు కానీ ప్రస్తావించలేదు. ఎవరినీ ప్రత్యక్షంగా ఉద్దేశించకుండా ఒక సాధారణ పొలిటికల్ సెటైర్గా దీనిని వదిలేశారు.
బండ్ల గణేష్ ‘స్వామిభక్తి’..
అయితే, ఈ ట్వీట్ చూసి లైట్ తీసుకోవాల్సింది పోయి, నిర్మాత బండ్ల గణేష్ ఇందులో దూకారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే పెట్టారంటూ ఫిక్స్ అయిపోయిన బండ్లన్న.. ఏమాత్రం గౌరవం లేకుండా ‘ఒరేయ్.. రా’ అంటూ అత్యంత అగ్రెసివ్గా రీట్వీట్ చేశారు.
“ఒరేయ్..నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవరు.. తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా.. దేశ ప్రధానివా?. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో.. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు.” ఇలా తీవ్ర పదజాలంతో బండ్ల గణేష్ రీట్వీట్ చేస్తూ తన ‘స్వామిభక్తి’ని చాటుకునే ప్రయత్నం చేశారని ఆ ట్వీట్ కింద కామెంట్ల ద్వారా అర్థం అవుతోంది.
పవన్ మాటలను పెడచెవిన పెట్టాడా?
ఇక్కడే నెటిజన్లు బండ్ల గణేష్ను గట్టిగా నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేయవచ్చు, మాట్లాడవచ్చు అని పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణలోని తన సొంత నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చెప్పారు. తమిళనాడులో మురుగన్ మహానాడు, మహారాష్ట్రలో శ్రీగురుతేగ్ బహదూర్ వర్ధంతి వేడుకకు హాజరై మాట్లాడే హక్కు పవన్కు ఉండొచ్చు, కానీ ఒక పౌరుడిగా ప్రకాష్ రాజ్కు ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి.. నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని బండ్ల గణేష్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ఒక అడ్రస్ లేని ట్వీట్ను పవన్ కళ్యాణ్కు రుద్ది, అనవసరంగా ఇష్యూని పెద్దది చేయడమే కాకుండా.. ప్రాంతీయ భావజాలాన్ని తెరపైకి తెచ్చి బండ్ల గణేష్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.








