ప‌రారీలో బండి భగీరథ్.. బాధితురాలి ఫోన్ హ్యాకింగ్‌కు కుట్ర?

ప‌రారీలో బండి భగీరథ్.. బాధితురాలి ఫోన్ హ్యాకింగ్‌కు కుట్ర?

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ‘హ్యాకింగ్’ ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఫోన్ హ్యాకింగ్‌కు బండి గ్యాంగ్?
ఈ కేసులో బాధితురాలి ఫోన్ నుంచి కీలక సమాచారాన్ని తొలగించేందుకు నిందితుడి అనుచరులు ప్రయత్నించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల ఒక ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్ ద్వారా బాధితురాలి ఫోన్‌ను హ్యాక్ చేయాలని నిందితుడి గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు లేదా చాట్స్ వంటి డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని వారు కోరినట్లు లీకులు అందుతున్నాయి.

అయితే, ఇది తీవ్రమైన పోక్సో కేసు కావడంతో, తాను చిక్కుల్లో పడతానని భావించిన సదరు యువ హ్యాకర్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ హ్యాకర్ గతంలో సైబర్ క్రైమ్ అనలిస్ట్‌గా పోలీసులతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం గమనార్హం. పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ, నిందితుడు ఇంతవరకు పోలీసులకు దొరకలేదు. బండి భగీరథ్ కేసు విచార‌ణ కోసం పోలీసులు ప్రత్యేకంగా సిట్ (SIT) బృందాలను ఏర్పాటు చేశారు.

హైకోర్టులో బెయిల్ పిటిషన్
మరోవైపు, అరెస్టు భయం పొంచి ఉండటంతో బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 14వ తేదీన విచారణ జరపనుంది.

కేంద్రమంత్రి కుమారుడు కావడంతో పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని, అందుకే అరెస్టులో జాప్యం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడు ఎంతటి వారైనా వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment