ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో బాలికలు (Girls), యువతులపై జరుగుతున్న వరస ఘటనలు కలవరపెడుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) జిల్లాలో కూతురు (Daughter)పై బాబాయ్ (Uncle) లైంగిక దాడి (Sexual Assault) చేసి గర్భవతిని చేసిన ఘటన మరువకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలంలోని ఓ గ్రామంలో మానవత్వాన్ని మంటగలసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితమవ్వడం, తల్లి గల్ఫ్ దేశానికి వెళ్లిపోవడంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన బాలికపై పెద్దనాన్న కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో గర్భవతిగా మారిన బాలికను పీలేరు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. ఆస్పత్రిలోనే ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం బయటపడుతుందేమోనని భయపడి బాలిక అన్న పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనను గుట్టుచప్పుడు కాకుండా ముగించేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు పసిబిడ్డను ఎవరికైనా అప్పగించి బాలికను తమ వద్ద ఉంచుకోవాలని యోచించినట్టు తెలిసింది.
అయితే ఈ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేయడం, బిడ్డను వేరే వారికి అప్పగించే ప్రయత్నాలు జరపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగి, ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








