ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గృహ నిర్మాణ కార్యక్రమంపై మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) కీలక ప్రకటనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలు (Housewarming Ceremonies) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకూ కూటమి పాలనలో 3 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, అదే ఉత్సాహంతో మరికొన్ని లక్షల ఇళ్లను సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ సారైనా మీ ప్రభుత్వం అలకేట్ చేసి నిర్మించి ఇళ్లకే శంకుస్థాపనలు చేసుకోండి అంటూ మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షం నుంచి సెటైర్లు పడుతున్నాయి. 18 నెలల్లో ఎక్కడ ఒక్క గజం భూమి కేటాయించకుండా, లబ్ధిదారులను గుర్తించకుండా, నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా, విడుదల చేయకుండా ఎలా సీఎం చంద్రబాబు 3 లక్షల ఇళ్లను పూర్తిచేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నలు వినిపించిన విషయం తెలిసిందే.
ఇటీవల చంద్రబాబు చేతుల మీదుగా నిర్వహించిన అనేక గృహప్రవేశాలు వాస్తవానికి మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పాలనలోనే పూర్తిచేయబడిన ఇళ్లేనని వైసీపీ ఆధారాలను బయటపెట్టింది. ఈ ఇళ్లకు అప్పటికే గృహప్రవేశాలు జరిగినట్టు లబ్ధిదారుల వీడియోలను కూడా బయటపెట్టడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తాయి.
ముఖ్యంగా మచిలీపట్నంలో జరిగిన ఒక ఘటన పెద్ద దుమారమే రేపింది. జగన్ హయాంలో పూర్తయ్యి అప్పుడే గృహప్రవేశం జరిగిన ఇంటికి మళ్లీ గృహప్రవేశం చేయించారని ఆ ఇంటి యజమానే వెల్లడించారు. టీడీపీ రంగులతో తయారుచేసిన కీస్ను మళ్లీ అందజేసినట్లు ఆరోపించడంతో అధికార పార్టీని ఇరుకునపడేసింది. కూటమిదంతా ప్రచార ఆర్భాటమేనని బయటపెట్టింది.
ప్రతి పేదవారూ స్వంతిల్లు కలిగి ఉండాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం హయాంలో మొత్తం 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అందులో 15 వేలకుపైగా ఇళ్లను పూర్తిచేసి కుటుంబాలకు అందజేశారన్నారు. జగన్ పూర్తిచేసిన ఇళ్లను మళ్లీ గృహప్రవేశాల పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడం దారుణమని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ మండిపడుతోంది.








