సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమారు 500 పేజీల ఛార్జ్షీట్ను కోర్టులో సమర్పించారు.
విచారణ సందర్భంగా అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, తదుపరి విచారణకు నిందితులందరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
500 పేజీల ఛార్జ్షీట్ను రికార్డులోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణలో కేసు పురోగతిపై మరిన్ని అంశాలను పరిశీలించనుంది. దీంతో ఈ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్నట్లు భావిస్తున్నారు.








