టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలు అందించిన ప్రముఖ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాల గురించి మాట్లాడిన యనమల.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పార్టీ తనకు అవకాశమిస్తే రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టారు. పార్టీ తనకు అవకాశం ఇవ్వకుంటే రాజకీయాలకు విరామం ప్రకటించి, విశ్రాంతి తీసుకుంటానని వెల్లడించారు. అంతేకాక, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇప్పుడు రాజకీయాలు ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. రెండు సార్లు తనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం మండలి నుంచి రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీలలో యనమల ఒకరు. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ సీట్లలో తనకూ అవకాశం ఉంటుందని యనమల రామకృష్ణుడు భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కొత్తవారికి అవకాశం ఇచ్చింది. దీంతో యనమల నిరాశకు గురయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న నాయకుడి పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడంపై ఆ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.